ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పుపైనే దృష్టి ఉంది. సోమవారం ఆసియాకప్ కోసం జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఈ సమావేశానికి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ హాజరుకానున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రిషభ్ పంత్ గాయంతో జట్టుకు దూరవవ్వడంతో వికెట్ కీపర్, నాలుగో స్థానం బ్యాటర్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇషాన్ కిషాన్, సంజు శాంసన్లో ఒకరికి అవకాశం వస్తుందని, కానీ ఇషాన్ కిషాన్ వైపే తాను మొగ్గుచూపుతానని గంగూలీ అన్నాడు. యువ క్రికెటర్లు నిర్భయంగా ఇన్నింగ్స్లు ఆడతారని, వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు.
మరోవైపు పసికూన ఐర్లాండ్తో టీమిండియా రెండో టీ20 ఆడనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన బుమ్రా సేన మూడు టీ20ల సిరీస్లో 1-0తో ముందంజలో ఉంది. ఇవాళ జరగనున్న మ్యాచ్లో కూడా గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని యువ భారత జట్టు ఉవ్విళ్తూరుతోంది. అయితే రింకూ సింగ్పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. తొలి మ్యాచ్లో వరుణుడి రాకతో రింకూకి అవకాశం రాలేదు. ఈ మ్యాచ్లో అయినా అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఐపీఎల్లో కోల్కతా తరఫున ఫినిషర్గా అతడు సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిందే.
హార్దిక్కు షాక్!
ప్రస్తుతం ఆల్రౌండర్ హార్దిక్పాండ్య టీమిండియా వైస్కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రోహిత్ విశ్రాంతి తీసుకున్నప్పుడు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక టీ20ల్లో అతడికే పూర్తి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా గతంలో చాలా వచ్చాయి. అయితే బుమ్రా రాకతో అతడిని వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించనున్నారని సమాచారం. గతంలో టెస్టుకు బుమ్రా సారథి బాధ్యతలు కూడా నిర్వర్తించాడని, అందుకే బీసీసీఐ కూడా తాజా నిర్ణయాన్ని అంగీకరిస్తుందని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.