చంద్రయాన్-3లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఈ వ్యోమ నౌక అనుకున్న లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకొని లూనార్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. బెంగళూరులోని ఇస్ట్రాక్ ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి శనివారం రాత్రి 7గంటలకు వ్యోమనౌకను జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. చంద్రయాన్-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను నేడు రాత్రి 11గంటలకు నిర్వహించనున్నారు.
ఈ విధంగా దశల వారీగా కక్ష్యను తగ్గిస్తూ చంద్రుడి చుట్టూ ఆరుసార్లు ఈ నెల 17 వరకు తిరిగిన అనంతరం చంద్రయాన్-3ను జాబిల్లికి చేరువ చేస్తారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి చేర్చనున్నారు. ఇదంతా సజావుగా సాగితే ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. కాగా, గత నెల 14న LVM3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్- 3ను ఇస్రో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.