కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్మనీ గెలిచే స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్ మేరా అధికార్’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే తొలుత మూడు రాష్ట్రాల్లో, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు తాము కొన్న వస్తువులకు విక్రేతల నుంచి ఇన్వాయిస్లను అడిగే విధంగా, వారిని ప్రోత్సహించేలా ఈ రివార్డు స్కీమ్ను తీసుకొస్తున్నారు. దీని వల్ల వ్యాపారులు జీఎస్టీను ఎగవేసేందుకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.
వచ్చే నెల నుంచి అసోం, గుజరాత్, హరియాణా, పుదుచ్చేరీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఈ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) మంగళవారం వెల్లడించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ స్కీమ్ కోం ‘మేరా బిల్ మేరా అధికార్’ పేరుతో మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన ఇన్వాయిస్లను ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాయిస్లపై విక్రేతల GSTIN నంబరు, ఇన్వాయిస్ నంబరు, చెల్లించిన మొత్తం, ట్యాక్స్ అమౌంట్ కచ్చితంగా ఉండాలి. అయితే ఈ స్కీమ్లో కేవలం జీఎస్టీ నమోదిత సప్లయర్లు విక్రయించిన వస్తువులు, సేవలకు సంబంధించిన బిల్లులకు మాత్రమే ఈ రివార్డు వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద నెలా వారీ లేదా మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారు. కనీసం రూ.200 అంతకంటే ఎక్కువ మొత్తం వెచ్చించిన ఇన్వాయిస్లను లక్కీ డ్రాకు పరిగణిస్తారు.